ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్. రాజు తనయుడు, యువ హీరో సుమంత్ అశ్విన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన హైదరాబాద్కు చెందిన దీపిక అనే యువతిని వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ శనివారం వీరి వివాహం హైదరాబాద్లో జరగనుంది. కాగా ఈ నేపథ్యంలో సుమంత్ అశ్విన్ ఇంట మెహెందీ ఫంక్షన్ ని నిర్వహించారు.
మెహెందీ ఫంక్షన్లో యువ జంట సుమంత్ అశ్విన్, దీపిక మెరిసిపోయారు. బంధు మిత్రులతో తమ ఆనందాన్ని పంచుకుని మురిసిపోయారు. గోల్డ్ కలర్ షేర్వాణీ ధరించి సుమంత్ అశ్విన్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. గత కొంత కాలంగా వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు షికారు చేస్తున్నా ఎం.ఎస్. రాజు పెదవి విప్పలేదు. ఇటీవల పెళ్లి ఫిక్సయిన తరువాతే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
దీపికి లాంటి అమ్మాయి మా అబ్బాయి అశ్విన్కి లభించడం అదృష్టం అని చెప్పుకొచ్చారు. దీపిక యు.ఎస్లో జాబ్ చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం సుమంత్ అశ్విన్ నటించిన చిత్రం `ఇది మా కథ`. శ్రీకాంత్, భూమిక కీలక పాత్రల్లో నటించి చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.