ఏ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది.. ఏ ప్రయత్నమైనా ఒక్కరితోనే ప్రారంభ మవుతుంది. ఏదైనా మంచి కార్యం జరగాలన్నా ఒక్కడే ముందుకు రావాలి.. కరోనా వేళ ఇప్పుడు అందరినీ కదిలిస్తున్న ఒకే ఒక్కడు సోనూసూద్. లాక్డౌన్ కారణంగా అంతా ఇంటికే పరిమితమైపోతే తాను మాత్రం వలస కార్మికుల కష్టాలకు చలించి తానున్నానంటూ ముందుకొచ్చారు. వారిని స్వస్థలాలకు చేర్చడంలో ప్రభుత్వాలు, ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తిన చందంగా చూస్తుంటే అన్నీ తానై ముందుకు నడిచి వలస కార్మికులకు, ఆపన్నులకు అండగా నిలిచాడు..
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచాడు. ఇటీవల యాదాద్రి సమీపంలో తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలుగా మిగిలిన ముగ్గురు పిల్లలపై ప్రసారమైన వార్తా కథనలకు స్పందించిన సోనూసూద్ వారి బాధ్యత తనదేనని ప్రకటించి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఇది తెలుసుకున్న దిల్ రాజు తాను ఆ పిల్లల్ని దత్తత తీసుకుంటానంటూ ప్రకటించడం పలువురిని ఆకట్టుకుంది. సోనూ కారణంగా సెలబ్రిటీలు కూడా స్పందించడం మొదలుపెట్టారు.
తాజాగా లెక్కల మాస్టారు సుకుమార్ కూడా సోనూ తరహాలోనే స్పందించారు. అది తమ సొంత ఊళ్లో వున్న స్కూల్ కోసం. ఈస్ట్ గోదావరి జిల్లా రాజోలు సమీపంలోని మట్టుపర్రు గ్రామం. ఈ గ్రామంలో సుకుమార్ తన తండ్రి బండ్రెడ్డి తిరుపతి నాయుడు పేరు మీద మండల ప్రజా పరిషత్ ప్రాధమిక ఉన్నత పాఠశాల ఆవరణలో రెండు అంతస్థుల పాఠశాల భవన నిర్మాణం చేయాలని ఈ నెల 1న నిర్ణయం తీసుకున్నారు. దీనికయ్యే ఖర్చు సుమారుగా 14 లక్షల రూపాయలని సుకుమార్ బరించబోతున్నారని తెలిసింది.