అతను వెండితెరపై విలన్.. కానీ రియల్ లైఫ్లో మాత్రం హీరో.. హీరోలని ముప్పుతిప్పలు పెడుతూ విలనిజాన్ని పండించే సోనూసూధ్ కరోనా మహమ్మారి ప్రబలుతున్న వేళ తనలో వున్న నిజమైన హీరోని ప్రపంచానికి చాటి చెబుతున్నాడు. ముంబైలోని తన హోటల్లో వంటలు చేయిస్తూ వేల మంది ఆకలి తీరుస్తున్నాడు.
అంతేనా లాక్డౌన్ కారణంగా రాష్ట్రాలు దాటి వచ్చిన వలస కార్మికుల పట్ల సాక్ష్యాత్తు దేవుడిగా మారిపోయాడు. సొంతూళ్లకు వెళ్లలేక కాలినడకన ఇంటి బాటపట్టాలనుకున్న వారిని ఆదరించి వారికి అండగా నిలుస్తున్నాడు. వందలాది వలస కార్మికులని సొంత ఖర్చులతో ప్రత్యేక బస్సుల్లో వారి సొంతూళ్లకు పంపించాడు.
ఇంతేనా.. తాజాగా వలస కార్మికుల కోసం సోనూభాయ్ చేసిన పని పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తూనే అతని గొప్ప మనసుని చాటిచెబుతోంది. ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్కు చెందిన 151 మంది మహిళా కార్మికులు ముంబైలో చిక్కుకుపోయారు. వారిని ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్లో భువనేశ్వర్ పంపించి వారి దృష్టిలో ప్రత్యక్ష దైవంగా మారడం విశేషం. ఈ విషయం తెలిసిన వారంతా సోనూసూద్ గొప్ప మనసుకు శిరస్సువంచి నమస్కరిస్తున్నారు. సోనూభాయ్ నిన్ను ఏమని వర్ణించను అంటూ ప్రతీ ఒక్కరూ పొగడ్తల్లో ముంచేస్తున్నారు. హ్యాట్సాఫ్ టు యూ సోనూసూద్.