రీల్ లైఫ్లో విలన్.. `అరుంధతి` వంటి చిత్రాల్లో పశుపతిగా అత్యంత క్రూరుడిగా నటించిన సోనూ సూద్ రియల్ లైఫ్లో మాత్రం రియల్ హీరోగా తన గొప్ప మనసు చాటుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీని వల్ల చాలా వరకు కకరోనా వైరస్ని కట్టడి అవుతోంది. అయితే పని లేక చాల మంది ఇబ్బందులు పడుతున్నారు.
వారి కోసం సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. మేము సైతం అంటూ ఆపన్నులకు అభయ హస్తం అందిస్తున్నారు. తమ వంతు బాధ్యతగా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న సోనూసూద్ తన వంతు సాయం చేయడానికి ముందుకొచ్చారు.
ఇటీవల వైద్య ఆరోగ్య సిబ్బందికి ముంబైలోని తన హోటల్ని కేటాయిస్తున్నట్టు ప్రకటించిన సోనూసూద్ తాజాగా ప్రతీ రోజు 45 వేల మందికి ఆహారం అందిస్తున్నట్టు ప్రకటించాడు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్తో కలిసి అంధేరి, జోగేశ్వరి, జుహూ, బాంద్రా ప్రాంతాల్లో ప్రతీ రోజు 45 వేల మందికి భోజనం అందిస్తున్నట్టు సోనూ సూద్ తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సమాజంలోని పేదలకు రోజూ భోజనం అందడం లేదు. అలాంటి వారికి సాయం చేసేందుకు నేను `శక్తి అన్నదానం` అనే కార్యక్రమాన్ని చేపట్టాను.మరింత మందికి సాయం చేయాలని భావిస్తున్నాను` అని తెలిపారు సోనూసూద్.