తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కీలక ఘట్టమైన పోలింగ్ నవంబర్ 30న ప్రశాంతంగా ముగిసింది. ఇక అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లు తమకే ఓటు వేశారంటూ చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో జరిగిని ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ పలువురి ఆశలపై నీళ్లు జల్లాయి. ముఖ్యంగా అధికార BRS పార్టీ అభ్యర్థులకు నిన్న వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ నిద్రలేకుండా చేస్తున్నాయి. రాష్ట్రంలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్కే దక్కబోతున్నాయని పలు మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్లో వెల్లడించాయి. దీంతో హస్తం పార్టీ నేతల్లో జోష్ నిండింది. రాబోయేది తమ ప్రభుత్వమే అంటూ వారు అప్పుడే ఫిక్స్ అయిపోయారు. కాగా, ఈ సంర్భంగా ఆ పార్టీలోని పలువురు కీలక నేతలు అప్పుడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి భట్టి విక్రమార్కకు భారీ మెజారిటీతో కూడిన విజయం దక్కాలని ఆ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు ఆకాంక్షిస్తున్నారు. దీనికోసం వారు ప్రత్యేక పూజలు కూడా చేశారు. తిరువూరు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అష్టలక్ష్మి దేవాలయంలో హోమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి భట్టి సతీమణి నందిని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె తిరువూరు కాంగ్రెస్ నాయకులు తమపై పెట్టుకున్న నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆమె వారిని ఘనంగా సత్కరించారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని.. ఇకపై దొరల పాలన తెలంగాణలో సాగదని ఆమె కామెంట్ చేశారు.
గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు, అక్రమాలను చూసి భట్టి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 1400 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని ఆమె తెలిపింది. ప్రజల్లో మమేకమైన ఆయన వారికి తాను ఉన్నట్లుగా భరోసానిచ్చారని ఆమె తెలిపింది. ప్రజల బాధలను తీర్చేందుకే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, ఇప్పుడు ఆ కల సాకారం కాబోతుందని ఆమె వెల్లడించింది. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీ పథకాలు, సామాన్య ప్రజలకు ఎంతో మేలును కలిగిస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు