ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా సోకిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురువారం రాత్రి విషమించడంతో ఆయనను ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు ఐసీయూకి తరలించాయి. శనివారం బాలు ఆరోగ్యం కాస్త మెరుగుపడటంతో ఎంజీఎం హాస్పిటల్ వర్గాలు తాజా హెల్త్ బులిటెన్ని విడుదల చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రస్తుతతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే వున్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇంకా ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందిస్తున్నామని ప్రకటించాయి. ఈ సందర్భంగా ఎస్పీ బాలు ఆరోగ్యంపై ఆయన తనయుడు చరణ్ స్పందించారు. వెంటిలేటర్పై వుంచడం వల్ల ఆయనకు మేలు జరిగిందని వెల్లడించారు. ప్రస్తుతం బాలు కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని డాక్టర్లు సంతోషం వ్యక్తం చేసినట్టు చరణ్ వెల్లడించారు.
స్వల్ప కోవిడ్ లక్షణాలతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ నెల 5న చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. తనకు ఎలాంటి ప్రమాదం లేదని, మీ ప్రేమాభిమానాలతో త్వరలోనే తిరిగి వస్తానని ఈ సందర్భంగా బాలు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో సందేశాన్ని షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ఉలిక్కిపడ్డారు.