కరోనా ప్రభావంతో థియేటర్లు మూసేయడంతో చాలా వరకు సినిమాలన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. తెలుగు చిత్రాలు మినహా బాలీవుడ్, కోలీవుడ్, కన్నడ, మలయాళ చిత్రాలు చాలా వరకు ఓటీటీకే జై కొడుతున్నాయి. కొన్ని స్టార్ హీరోలకు సంబంధించిన చిత్రాలకు భారీ ఆఫర్లు లభిస్తున్నా ఓటీటీలకు ఇవ్వడానికి అంగీకరించడం లేదు.
ఇదిలా వుంటే సీనియర్ హీరో యాంగ్రీ యంగ్ మెన్ డా. రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని నటిస్తున్న చిత్రం ఓటీటీకే వెళుతోందట. బాలీవుడ్ హిట్ చిత్రం `టు స్టేట్స్` ఆధారంగా తెరకెక్కనున్న సినిమాతో శివాని హీరోయిన్గా తెరంగేట్రం చేయాల్సింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం ఆరంభ దశలోనే ఆగిపోయింది. దీంతో కొంత కాలం పరిచయ చిత్రం కోసం ఎదురుచూసిన శివాని తాజాగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఎస్ ఒరిజినల్స్, మహాతేజ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతోంది.
చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం లాక్డౌన్కి ముందు అత్యధిక శాతం చిత్రకరణ పూర్తి చేసుకుంది. మిగిలిన భాగాన్ని పూర్తిచేసి చిత్రాన్ని ఓ ప్రముఖ ఓటీటీలో రిలీజ్ చేయాలని చిత్ర వర్గాలు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. శివాని పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ని చిత్ర బృందం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.