సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరువాత బాలీవుడ్లో బంధు ప్రీతిపై పెద్ద చర్చ జరుగుతోంది. బంధు ప్రీతి కారణంగానే సుశాంత్ ఆత్మ హత్య చేసుకున్నాడని, దానికి బాలీవుడ్ సెలబ్రిటీలే కారణమని నెటిజన్స్, సుశాంత్ ఫ్యాన్స్ బాలీవుడ్ వర్గాలపై ఫైర్ అవుతున్నారు. సుశాంత్ మరణం తరువాత చాలా మంది తాము ఎదుర్కొన్న సమస్యలపై గళం విప్పుతున్నారు. తాప్సీ, కంగన రనౌత్, స్వర భాస్కర్… ఇలా చాలా మంది బాలీవుడ్లో తమకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించారు.
ఇదే కర్మంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ కూడా బాలీవుడ్లో తనపై కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తనకు అవకాశాలు రావడం లేదని, రాకుండా కొంత మంది చేస్తున్నారని రెహమాన్ ఆరోపించారు. దీనిపై ప్రముఖ దర్శకుడు, నిర్మాత శేఖర్ కపూర్ స్పందించారు. `నీకు నీ సమస్య ఏంటో తెలుసా? రెహమాన్.. నువ్వు హాలీవుడ్కు వెళ్లావ్..ఆస్కార్ సాధించావ్. ఆస్కార్ సాధించడం అంటే బాలీవుడ్ అవకాశాలకు మరణ శాసనం రాసుకోవడమే. ఆస్కార్ సాధించడంతో నీ స్థాయి బాలీవుడ్ హ్యాండీల్ చేసే స్థాయి కాదని నిరూపించబడింది` అని కామెంట్ చేశారు.
దీనికి రెహమాన్ సమాధానంగా ఓ ట్వీట్ చేశారు. `డబ్బు పోతే మళ్లీ వస్తుంది. ఫేమ్ పోతే మళ్లీ వస్తుంది. కానీ జీవితంలో విలువైన కాలం పోతే మళ్లీ తిరిగిరాదు.. అందుకే దేనినీ పట్టించుకోకుండా ముందుకుసాగడమే.. మనం చేయాల్సింది ఇంకా చాలా వుంది` అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.