2018, 2019 వరుస ఫ్లాపుల్ని చూశారు యంగ్ హీరో శర్వానంద్. ఈ రెండేళ్లలో ఆయన చేసిన పడి పడి లేచే మనసు, రణరంగం బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆలోచనలో పడ్డ శర్వానంద్ 2020 కోసం ఏకంగా మూడు చిత్రాల్ని లైన్లో పెట్టారు. అందులో ఒకటి తమిళ హిట్ `96` ఆధారంగా రూపొందుతోంది. `జాను` పేరు రీమేక్ అవుతున్న ఈ చిత్రాన్ని ఈ నెలలోనే రిలీజ్ చేస్తున్నారు.
దీనితో పాటు శర్వా చేస్తున్న మరో చిత్రం `శ్రీకారం`. కిషోర్ . బి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు, కొత్త తరహా కథా, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా పరిచయమవుతోంది. 14 ప్లస్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట నిర్మిస్తున్నారు.
ఇటీవల ఇదే బ్యానర్లో వరుణ్ తేజ్ హీరోగా `గద్దలకొండ గణేష్` చిత్రం రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత కంప్లీట్ న్యూజోనర్లో `శ్రీకారం` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. హైదరాబాద్లో షూటింగ్ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి చిత్రాన్ని ఏప్రిల్ 24న రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.