గత నాలుగు దశాబ్దాల కాలంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పాత్రికేయులుగా వివిధ సంస్థల్లో పనిచేసిన పసుపులేటి రామారావు (70) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయనను వనస్థలిపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో మంగళవారం ఉదయం మృతి చెందినట్లు డాక్టర్లు దృవీకరించారు. ఆయనకు భార్య, కుమారుడు వున్నారు. మెగాస్టార్ చిరంజీవి అంటే పసుపులేటి రామారావుకు వల్లమాలిన అభిమానం. ఆ అభిమానంతో ఆయనకు లేక లేక కలిగిన కుమారుడికి చిరు, నాగబాబు, పవన్కల్యాణ్ల పేర్లు కలిసి వచ్చేలా కల్యాణ్నాగచిరంజీవిగా నామకరణం చేశారు.
వామ పక్ష భావాలు గల పసుపులేటి రామారావు అదే విలువలతో సినీ పాత్రికేయ రంగంలో పనిచేశారు. ఆంధ్ర పత్రిక, ఆంధ్రజ్యోతి నుంచి వెలువడే జ్యోతిచిత్ర సినీ వార పత్రికతో పాటు దాసరినారాయణ రావుకు చెందిన శివరంజని, సురేష్కొండేటి నిర్వహిస్తున్న సంతోషం సినిమా పత్రికల్లో సీనియర్ పాత్రికేయులుగా సేవలందించారు. శ్రీదేవి, చిరంజీవి, సావిత్రితో పాటు పలువురు నటీనటులపై పుస్తకాలు రాశారు. ఆయన మృతి పట్ల చిరంజీవితో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పసుపులేటి రామారావు పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. పసుపులేటి రామారావు అంత్య క్రియలు బుధవారం ఉదయం 11 గంటలకు మహాప్రస్థానం స్మశాన వాటికలో జరగనున్నాయి.