దేశంలో కరోనా అంటే భయం పోయింది.. నానాటికీ కేసులు పెరుగుతున్నా జనాల్లో మాత్రం అవగాహన పెరగడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇప్పటికీ చాలా మంది కరోనా బారిన పడుతూనే వున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. సినీ వర్గాల్లో కూడా దీని బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది.
తాజాగా తమిళ నటుడు శరత్కుమార్ కు కరోనా పాజిటివ్ అని తేలినట్టు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా శరత్కుమార్ కూతురు, హీరోయిన్ వరలక్ష్మీ శరత్కుమార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కరోనా లక్షణాలు లేకుండానే శరత్కుమార్కు పాజిటివ్ అని తేలిసిందని తెలిపారు. `నాన్నకు పాజిటివ్ అని ఈ రోజు తెలిసింది. ప్రస్తుతం నాన్న హైదరాబాద్లోనే వున్నారు. ఇక్కడే ఆయనకు చికిత్స జరుగుతోంది. మంచి వ్యక్తులు ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఆయనకు సంబంధించిన వివరాల్ని మీకు అందిస్తూనే వుంటారు` అని వరలక్ష్మీ శరత్కుమార్ ట్వీట్ చేసింది.
అంటే శరత్కుమార్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నమాట. ఇదిలా వుంటే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియిన్ సెల్వన్` చిత్రంలో శరత్కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది.