ప్రతీ సంక్రాంతికి టాలీవుడ్ లో మూడు నుండి నాలుగు సినిమాలు విడుదలవ్వడం పరిపాటి. సాధారణంగా సంక్రాంతి అంటే ప్రజలు ఎక్కువగా థియేటర్లవైపే వస్తారు. అందుకే సంక్రాంతి పండగ టాలీవుడ్ కు చాలా స్పెషల్. మూడు, నాలుగు సినిమాలు విడుదలవుతాయి కాబట్టి ఆయా సినిమాల నిర్మాతలు ముందుగానే ఒప్పందం చేసుకుని ఏ సినిమా ముందు రావాలి ఏ సినిమా తర్వాత రావాలి అన్న నిర్ణయాలు తీసుకుంటారు.
దీంతో ఏ ఇబ్బంది లేకుండా ఇన్నాళ్లూ సినిమాలు విడుదల చేసుకున్నారు నిర్మాతలు. అయితే ఈసారి సంక్రాంతికి విడుదలవుతున్న మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో మధ్య సఖ్యత ఇంతదాకా కుదరలేదు. రెండూ సంక్రాంతికి వస్తున్నా ముందు ఎవరు రావాలి, వెనక్కి ఎవరు వెళ్ళాలి అన్న మీమాంస కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో రెండు చిత్రాలు కూడా జనవరి 11వ తేదీని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు భారీ చిత్రాలు కనుక ఒకే రోజు విడుదలైతే రెండూ చిత్రాలకే నష్టం తప్పదు. ఎవరూ కూడా పండగ అడ్వాంటేజ్ ను క్యాష్ చేసుకోలేరు. మరి వచ్చే ఏడాది లోగా ఇద్దరు నిర్మాతలు కలిసి చర్చించుకుంటారా లేక పంతాలకు పోతారా అన్నది చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఇద్దరూ పోటాపోటీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఒక పోస్టర్ విడుదల చేయగానే మరొకరు పోస్టర్ దింపడం వంటివి చేస్తున్నారు. చూద్దాం మరి చివరికి ఏమవుతుందో.