కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం భయంతో వణికిపోతోంది. ఎక్కడ, ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని జనం భయపడుతున్నారు. అంత కంతకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు దేశంతో పాటు తెలుగు రాష్ట్రాలని కమ్మేస్తున్నాయి. ఏం చేయాలో తెలియని అయోమయ స్థితితకి చేరుకుంటున్నాం.
ఈ పరిస్థితిని ముందే పసిగట్టిన కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడి కోసం 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ని ప్రకటించింది. దీంతో కీలక సంస్థలన్నీ స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. ఎక్కడి వారు అక్కడే గప్ చుప్ అన్నట్టుగా జనం ఇళ్లకే పరిమితం అయిపోయారు. కరోనా నుంచి బయటపడాలంటే ఇంటి పట్టున ఉండటమే ఏకైక మార్గంగా భావించి ఇళ్లకే పరిమితమైపోతున్నారు.
సినిమా షూటింగ్లో కూడా ఆగిపోవడంతో సినీ కార్మికులు తీవ్ర సంక్షేభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ ఆపత్కాలాన్ని దృష్టిలో పెట్టుకుని కార్మికులకు అండగా నిలవడం కోసం చిరంజీవి చైర్మన్గా సీసీసీ (కరోనా క్రైసిస్ చారిటీ)ని ఏర్పాటు చేసి ప్రముఖులంతా విరాళాలు ప్రకటించారు. ఇప్పటికీ ప్రకటిస్తూనే వున్నారు. తాజాగా దర్శకుడు సంపత్ నంది కూడా సీసీకి 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ సంక్షోభ సమయంలో అంతా ఇంటికే పరిమితం కావాలని, తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సంపత్ నంది విజ్ఞప్తి చేశారు.