ఓ పక్క సినిమాలతో పాటు మరో పక్క సోషల్ వర్క్ తో యమ బిజీగా వుంటోంది స్టార్ హీరోయిన్ సమంత. ఆమె నటించిన తొలి వెబ్ సిరీస్ `ఫ్యామిలీ మెన్ 2` స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న నేపథ్యంలో తాజాగా గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మైథలాజికల్ రొమాంటిక్ సాగా `శాకుంతలం`లో నటిస్తోంది సమంత. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. దేవ్ మోహన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై దిల్ రాజుతో కలిసి నీలిమ గుణ నిర్మిస్తున్నారు.
ఇదిలా వుంటే సినిమాల్లో నటిస్తూనే తను స్థాపించిన ఎంజీఓ ప్రత్యూష సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సమంత. గత కొన్నేళ్లుగా ఈ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సంస్థ ద్వారా ఎలాంటి ఆధారం లేని పిల్లలతో పాటు మహిళలకు చేయూత నిస్తున్నారామె. తాజాగా సమంత తన ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఓ మహిళా ఆటోగ్రైవర్కు కార్ని బహుమతిగా ఇచ్చారు.
మియాపూర్ టు బాచుపల్లి వరకు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద మహిళ కవిత గురించి తెలుసుకున్న సమంత ఆమెకు కార్ని బహుమతిగా అందించి తన గొప్ప మనసుని చాటుకున్నారు. గతంలో ఆమెకు ప్రామిస్ చేసిన సమంత అన్నట్టుగానే కవితకు 12.5 లక్షల కార్ని బహుమతిగా అందించారు. ఈ కారుని కవిత ట్యాక్సీగా నడుపుకోబోతోంది. ఈ విషయం తెలిసిన వాళ్లంతా సమంత పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.