కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. దీని కారణంగా పరిశ్రమలన్నీ తాత్కాలికంగా మూతపడ్డాయి. సినీ ఇండస్ట్రీ కూడా ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటోంది. 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించడం, తాజాగా దాన్ని మే 7 వరకు పొడిగించడంతో రిలీజ్కు రెడీగా వున్న సినిమాల పరిస్థితి కొంత ఆందోళన కరంగా మారింది.
రోజుకో సినిమాపై పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇటీవల రాజ్ తరుణ్ నటించిన `ఓరేయ్ బుజ్జిగా` చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్లో రిలీజ్ చేస్తున్నారంటూ ప్రచారం జరిగింది. అందులో ఎలాంటి నిజం లేదని నిర్మాత కె.కె. రాధామోహన్ స్పష్టం చేయడంతో పుకార్లకు బ్రేక్ పడింది. ఆ తరువాత రామ్ `రెడ్` చిత్రంపై కూడా ఇలాంటి పుకారే రావడంతో రామ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
తాజాగా ఇదే రూమర్ అనుష్క నటించిన `నిశ్శబ్దం` చిత్రంపై మొదలైంది. కోన వెంకట్, టి.జి. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని, అయితే ఈ ప్రతి పాదనకు అనుష్క అంగీకారం తెలపడం లేదని పుకార్లు మొదలయ్యాయి. ఈ పుకార్లలో ఎలాంటి వాస్తవం లేదని, అనుష్క, కీలక నటీనటులు, చిత్ర బృందం సినిమా ప్రారంభం నుంచి తమకు సహకరిస్తున్నారని, మా చిత్రాన్ని ఎలాంటి ఓటీటీ ప్లాట్ ఫామ్లో రిలీజ్ చేయడం లేదని స్పష్టం చేశారు.