నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం `శ్యామ్ సింగరాయ్`. రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వెంకట్ బోయిన పల్లి నిర్మిస్తున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ తెరకెక్కిస్తున్నారు.
ఈ మూవీకి సంబంధించిన కీలక షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతోంది. ఇది ఈ మూవీకి సంబంధించిన చివరి షెడ్యూల్. ఇందు కోసం కోల్కతా ని తలపించేలా భారీ సెట్ని నిర్మించారు. నగర శివారులో పది ఎకరాల విస్తీర్ణంలో 6.5 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన సెట్లో కీలక ఘట్టాలని చిత్రీకరిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో ఈ మూవీ డిజిటల్, శాటిలైట్ రైట్స్కు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ప్రముఖ ఓటీటీ వేదికలతో పాటు సన్, స్టార్, జీ నెట్వర్క్లు భారీ మొత్తంలో ఆఫర్ చేసినట్లు తెలిసింది. ఈ రైట్స్కి 30 కోట్లని పలు సంస్థలు ఆఫర్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.