నేచురల్ స్టార్ నాని హరోగా నటిస్తున్న పాన్ ఇండియా స్థాయి మూవీ `శ్యామ్ సింగరాయ్`. `ట్యాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి, `ఉప్పెన` ఫేమ్ క్రితిశెట్టి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది.
పూజా కార్యక్రమాల అనంతరం హీరో నాని, హీరోయిన్లు సాయి పల్లవి, `ఉప్పెన` ఫేమ్ క్రితిశెట్టి లపై చిత్రీకరించిన మూహూర్తపు సన్నివేశానికి హీరో నాని ఫాదర్ గంటా రాంబాబు క్లాప్ నిచ్చారు. దర్శకుడు మేర్లపాక గాంధీ కెమెరా స్విఛాన్ చేశారు. మరో దర్శకుడు అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర స్క్రిప్ట్ని యువ దర్శకులు వెంకీ కుడుముల, శివ నిర్వాణ దర్శకుడు రాహుల్ సంక్రీత్యన్కు అందజేశారు.
ఈ సందర్భంగా నాని తన తండ్రి గంటా రాంబాబుకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకోవడం పలువురిని ఆకట్టుకుంది. చిత్రంలో రాహుల్ రవీంద్రన్, `ప్రేమమ్` ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ కూడా కీలక పాత్రల్లో నటించనున్నారు. ఇందులో హీరో నాని పూర్తిగా భిన్నమైన పాత్రలో 70 ఏళ్ల వయసుమళ్లిన వ్యక్తిగా కనిపించనున్నాడట. ఈ పాత్రను పోషించడానికి నాని కఠోరంగా శ్రమించి ప్రత్యేక శిక్షణ పొందారట. ఈ నెలలో సెట్స్ పైకి కానున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.