ఏపీ రాజకీయాల్లో ఎగ్రసీవ్ లేడీగా, విమర్శలకు బెదరని మహిళా నేతగా, నటిగా, ఎమ్మెల్యే రోజాకు పేరుంది. క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించాక టీవీ షోల్లో తప్ప వెండితెరపై కనిపించడం దాదాపుగా తగ్గించారామె. మళ్లీ ఆమె పవర్ఫుల్ పాత్రల్లో నటించడానికి సై అంటున్నారా? అవుననే సమాధానం వినిపిస్తోంది. జబర్దస్త్ షోలో మాత్రమే కనిపిస్తూ వస్తున్న రోజా త్వరలో ఓ పవర్ఫుల్ పాత్రలో వెండితెరపై కనిపించబోతోందని ఫిల్మ్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది.
అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్, ముత్యం శెట్టి మీడియా బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. నెల్లూరు యాస నేపథ్యంలో లారీడ్రైవర్గా రగ్గ్డ్ క్యారెక్టర్లో అల్లు అర్జున్ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది.
ఇదిలా వుంటే ఈ చిత్రంలో విలన్గా రోజాని చిత్ర బృందం సంప్రదించినట్టు ప్రచారం జరుగుతోంది. క్యారెక్టర్ పవర్ఫుల్గా వుండటం, `రంగస్థలం` ఫార్మాట్లో వాస్తవికతకు దగ్గరగా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాలో నటించడానికి రోజా అంగీకరించినట్టు తాజా సమాచారం. ఇది ఎంత వరకు నిజం అన్నది తెలియాలంటే మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే.