బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు తాజాగా కీలక మలుపు తిరిగింది. అతని మరణంపై దేశ వ్యాప్తంగా అనుమానాలు రేకెత్తడంతో కేంద్రం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. వెంటనే విచారణ వేగవంతం చేసిన సీబీఐ నటి, సుశాంత్ లవర్ రియా చక్రవర్తిపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయడం సంచలనంగా మారింది. రియాతో పాటు ఆమె తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి, తల్లి సంధ్య చక్రవర్తి, సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ ఇంటి మేనేజర్ శ్యామ్యూల్ మిరందా, రియా చక్రవర్తి మాజీ మేనేజర్ శృతి మోదీలతో పాటు పలువురు అనుమానితులపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం ఆసక్తికరంగా మారింది.
సుశాంత్ తండ్రి కెకె సింగ్ రాజ్పుత్ రియాపై అనుమానం వ్యక్తం చేయడం, ఆమెపై కేసు పెట్టడమే కాకుండా తన తనయుడి మృతిపై అనుమానాలున్నాయని, సీబీఐ ఎంక్వైరీకి సిఫారసు చేయమని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ని కోరడం, ఆయన వెంటనే కేంద్రానికి సిఫారసు చేయడం, కేంద్ర సుశాంత్ కేసుని సీబీఐకి అప్పగించడం చకచకా జరిగిపోయాయి. అయితే ఇది ఫెడరల్ వ్యవస్థకే వ్యతిరేకమని రియా చక్రవర్తి సీబీఐని ప్రశ్నించడం సంచలనంగా మారింది. ఓ ప్రముఖ జాతీయ మీడియాతో గురువారం ముచ్చటించిన రియా చక్రవర్తి .
ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పాట్నాలో తనపై సుశాంత్ తండ్రి పెట్టిన కేసుని ముంబైకి బదిలీ చేయాలంటూ రియా సుప్రీమ్ కోర్టుని ఆశ్రయించిన విషయం తెలిసిందే. సుప్రీమ్ తీర్పు వెలువరించే లోపు రియాపై సీబీఐ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే విషయాన్ని ప్రస్థావించిన రియా ఇలా సీబీఐ వ్యవహరించడం ఫెడరల్ వ్యవస్థకు విరుద్ధమని వాదిస్తోంది. రియా తప్పు లేనప్పుడు ఎందుకు సుప్రీమ్ని ఆశ్రయించిందని, సీబీఐని కూడా ఎందుకు తప్పుపడుతోందని పలువురు బాలీవుడ్ జనాలు మండిపడుతున్నారు.