బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14న ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతని మరణం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇక బాలీవుడ్లో కొత్త చర్చకు దారితీస్తోంది. సుశాంత్ మరణం ఆది నుంచి మిస్టరీగా మారడంతో అతని తండ్రి కె.కె. సింగ్ సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిపై కేసు ఫైల్ చేయడం కొత్త మలుపు తిరిగింది. సుశాంత్ మృతి వెనకున్న మిస్టరీ వీడాలంటే రియా ఆ మిస్టరీ ఏంటో చెప్పాల్సిందే అంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో రియా ఎట్టకేలకు పెదవి విప్పింది. ఏడాది కాలం పాటు సుశాంత్తో సహజీవనం (లీవిన్ రిలేషన్ షిప్) చేశానని, జూన్ 8న అతని నుంచి విడిపోయి తన ఇంటికి తాను వెళ్లిపోయానని వెల్లడించింది. రియా వెళ్లిన వారం రోజుల్లోపే సుశాంత్ ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ఏం జరిగిందో మాత్రం రియా వెల్లడించలేదు.
సుశాంత్ ఫాదర్ కెకె సింగ్, అర్నబ్ గోస్వామికి చెందిన రిపబ్లిక్ టీవి మాత్రం రియా చక్రవర్తి, ఆమె సోదరుడిపై అనుమానాన్ని వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. సుశాంత్ వద్ద వున్న కోట్లాది రూపాయాల్ని రియా, ఆమె సోదరుడు దోచుకున్నారని, సుశాంత్ను మోసం చేశారని, ఆ కారణంగానే డిప్రెషన్కు గురైన సుశాంత్ మృతి చెందాడని సంచలన కథనాన్ని రిపబ్లిక్ టీవి ప్రసారం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.