సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతిపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అతని మృతి వెనక దాగి వున్న రహస్యాల్ని ఛేదించే బాధ్యతని సీబీఐకి అప్పగిస్తూ సంచలన తీర్పు చెప్పడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇదిలా వుంటే సుశాంత్ మృతి కేసులో ప్రధాన అనుమానితురాలిగా భావిస్తున్న రియా చక్రవర్తి త్వరలో సీబీఐ ముందు హాజరు కానున్నట్టు తెలుస్తోంది.
ఈ విషయాన్ని ఆమె లాయర్ స్వయంగా వెల్లడించారు. సీబీఐ ముందు విచారణకు హాజరు కావడానికి రియా ఏ మాత్రం భయపడటం లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. రియా ఇప్పటికే ఈ కేసు విషయంలో ముంబై పోలీసుల ముందు హాజరైందని, ఆ తరువాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు కూడా హాజరై తన వాదన వినిపించిందని సీబీఐ సమన్లు పంపిస్తే తప్పకుండా సీబీఐని ఎదుర్కోవడానికి రియా సిద్ధంగా వుందని, నిజా నిజాలేంటో త్వరలోనే తెలుస్తాయని ఆమె లాయర్ స్పష్టం చేయడం ఆసక్తికరంగా మారింది.
జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన అపార్ట్మెంట్లో అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ అనూహ్య ఘటనపై దేశ వ్యాప్తంగా పలు అనుమానాలు వ్యక్తం కావడం, సుశాంత్ కుటుంబం రియాపై అనుమానం వ్యక్తం చేయడం, బీహార్ ముఖ్యమంత్రి సుశాంత్ కేసుని సీబీఐకి అప్పగించాలంటే డిమాండ్ చేయడంతో ఫైనల్గా ఈ కేసుని సుప్రీమ్ కోర్టు సీబీఐకి అప్పగించడం సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.