స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి 18 నెలల విరామం తరువాత వస్తున్న చిత్రం `అల వైకుంఠపురములో`. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. లేట్గా వచ్చినా లేటెస్ట్గా బ్లాక్బస్టర్ హిట్ని సొంతం చేసుకుంటానని బన్నీ మాటల్లో ధీమా కనిపిస్తోంది. వాతావరణం కూడా బన్నీకి అనుకూలంగానే కనిపిస్తోంది. తమన్ అందించిన గీతాలు ఇప్పటికే యూట్యూబ్లో వైరల్ కావడం, ఒక్కో పాటు 100 మిలియన్ వ్యూస్ని దాటడంతో ఈ సంక్రాంతికి బ్లాక్బస్టర్గా నిలిచే సినిమా ఇదేని ఇప్పటికే ట్రేడ్ పండితుల్లో చర్చ జరుగుతోంది.
ఆదివారం సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో బన్నీ పలు మీడియాలతో ఇంటరాక్డ్ అవుతున్నారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఎవరికీ తెలియని ఓ విషయాన్ని బయటపెట్టారు. ఓ రియాలిటీ షో నిర్వాహకులు తనకు కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని, అయితే తాను అందుకు అంగీకరించలేదని, ఎన్ని కోట్లు ఇస్తామని చెప్పినా తను పట్టించుకోలేదని సీక్రెట్ బయటపెట్టారు.
`అల వైకుంఠపురములో` మ్యూజిక్ కాన్సెర్ట్లో తాను డ్యాన్స్ చేస్తానని, అంత సేపు స్టేజ్పై మాట్లాడతానని ఊహించలేదని, అదలా జరిగిపోయింది అంతే అన్నారు. బన్నీ, త్రివిక్రమ్ ముచ్చటగా మూడవసారి కలిసి పనిచేసిన `అల వైకుంఠపురములో` 12న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. కీలక పాత్రల్లో టబు, సుశాంత్, సునీల్, నివేదా పేతురాజ్ నటించారు.