మాస్ మహారాజా రవితేజ తన కెరీర్ లో ఇప్పుడు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. వరసగా నాలుగు సినిమాలు ప్లాపయ్యాయి. రాజా ది గ్రేట్ చిత్రం కంటే ముందు కూడా రవితేజకు ప్లాపులు ఉన్నాయి. తన లాస్ట్ సినిమా డిస్కో రాజా అయితే సింగిల్ డిజిట్ షేర్ కే పరిమితమైంది. ఈ చిత్రంతో తన మార్కెట్ ఏ రేంజ్ కు పడిపోయిందన్నది అర్ధమైపోతుంది. అయితే రవితేజకు ఒక్క హిట్ వస్తే మళ్ళీ పరిస్థితులు నార్మల్ కు వచ్చేస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకోసమేనేమో వరస ప్లాపుల్లో ఉన్నా కానీ రవితేజకు సినిమాలు తగ్గట్లేదు. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.
డిస్కో రాజా విడుదలకు ముందే తన నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టేశాడు రవితేజ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. మే కు రిలీజ్ అనుకున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగింది. అయితే ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా షూటింగ్ కు అంతరాయం కలిగింది. మళ్ళీ పరిస్థితులు కుదుటపడ్డాక షూటింగ్ మొదలవుతుంది.
ఈ చిత్రం కాకుండా రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక చిత్రం చేయబోతున్నాడు. దీనికి కిలాడి అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇది కూడా కాకుండా త్రినాథరావు నక్కిన, వక్కంతం వంశీ సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. వరస ప్లాప్స్ లో ఉన్న హీరోకు ఇలా అవకాశాలు వెల్లువలా రావడం విశేషమే. అయితే ఇక్కడ రవితేజ చేస్తున్న తప్పు ఒకటుంది.
ప్లాప్స్ ఉన్నా కానీ తనకు డిమాండ్ ఉండడంతో రవితేజ రెమ్యునరేషన్ విషయంలో ఎక్కడా తగ్గట్లేదు. డిస్కో రాజా చిత్రానికి 10 కోట్లు తీసుకున్న రవితేజ, క్రాక్ కు కూడా 10 కోట్ల పైనే పుచ్చుకున్నట్లు సమాచారం. కిలాడీ చిత్రానికి కొంత తగ్గించుకోమని నిర్మాత వేడుకున్నా కానీ 10 కోట్లకు ఒక్క రూపాయి తగ్గినా చేసేది లేదని తెగేసి చెప్పేశాడట. రెమ్యునరేషన్ విషయంలో మొదటినుండి రవితేజ పక్కాగా ఉంటాడన్న ఒక రూమర్ ఉంది. దీన్ని రవితేజ ఒక సందర్భంలో ఒప్పుకున్నాడు కూడా.