మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం పీకల్లోతు ప్లాపుల్లో మునిగిపోయిన సంగతి తెల్సిందే. రాజా ది గ్రేట్ తర్వాత రవితేజ నటించిన నాలుగు చిత్రాలు దారుణమైన ప్లాపులుగా మిగిలాయి. అంతే కాకుండా రాజా ది గ్రేట్ ముందు కూడా రవితేజ సినిమాలు ప్లాపులయ్యాయి. ఈ నేపథ్యంలో ఎవరికైనా సినిమాలు రావడానికి ఇబ్బంది అవుతుంది. ప్లాప్స్ ఉంటే సినిమాలు తగ్గుతాయి. దర్శకనిర్మాతలు హిట్స్ లో ఉన్న హీరోనే కన్సిడర్ చేస్తారు. అది సహజం కూడా. సక్సెస్ మీద నడిచే ఇండస్ట్రీ ఇది.
అయినా కానీ రవితేజ సినిమాల పరంగా చాలా బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ లో ఏ హీరో లేనంత బిజీగా మాస్ మహారాజా ఉండడానికి కారణమేంటి? పైగా రవితేజ రెమ్యునరేషన్ విషయంలో కచ్చితంగా ఉంటాడన్న పేరుంది. మరెందుకు మనోడికి అవకాశాలకు కొదవ లేకుండా ఉంది అంటే ఇటీవలే పారితోషికం విషయంలో రవితేజ చేసుకున్న చిన్న చిన్న మార్పులే.
ప్రస్తుతం రవితేజ రెమ్యునరేషన్ ను ముందే తీసుకోవట్లేదట. మహేష్, ఎన్టీఆర్ వంటి హీరోల తరహాలో లాభాల్లో వాటా తీసుకుంటున్నాడట. దీని వల్ల నిర్మాతలకు చాలా వరకూ భారం తగ్గుతోంది. ఇలా చేయడం వల్ల హీరోలు కూడా ఖర్చు తగ్గించడానికే చూస్తారు కాబట్టి నిర్మాతలకు రెండు వైపులా లాభాలే. ప్రస్తుతం రవితేజ ప్లాపుల్లోనే ఉండొచ్చు కానీ తన ఫ్యాన్స్ బేస్ అలాగే పదిలంగా ఉంది. సో ఒక్క హిట్ వస్తే మళ్ళీ మినిమం గ్యారంటీ హీరోల్లో టాప్ రేంజ్ కు చేరుకుంటాడు రవితేజ. మాస్ లో ఎక్కువ ఫాలోయింగ్ ఉండడంతో హిట్ టాక్ వస్తే ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేదు.
ప్రస్తుతం రవితేజ క్రాక్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మే 8న ఈ చిత్రం విడుదల కానుంది. దీని తర్వాత రవితేజ చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. తనతో వీర తీసిన రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ సినిమా చేయాలి. అలాగే త్రినాథరావు నక్కిన, వక్కంతం వంశీ కథలను కూడా ఓకే చేసుకుని ఉన్నాడు. అయితే వీటిలో ఏ చిత్రం ఎప్పుడు విడుదలయ్యేది తెలియాలంటే మరికొంత కాలం ఆగాలి.