కరోనా దెబ్బతో థియేటర్లు మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో చాలా సినిమాలు రిలీజ్కు నోచు కోవడం లేదు. ఎంతగా ఓటీటీ ప్లాట్ ఫామ్లు భారీ ఆఫర్లతో టెమ్ట్ చేస్తున్నా మేకర్స్ మాత్రం తమ చిత్రాల్ని ఓటీటీల్లో రిలీజ్ చేయడానికి ఇష్టపడటం లేదు. ఇప్పటికే కీర్తి సురేష్ నటించిన `పెంగ్విన్` ఓటీటలో రిలీజైపోయింది. `మిస్ ఇండియా` కూడా ఇదే బాటలో ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇక తాజాగా నాని, సుధీర్బాబు కలిసి నటించిన `వి` చిత్రం కూడా ఓటీటీ బాటపడుతోంది. `నిశ్శబ్దం` కూడా థియేటర్కా, లేక ఓటీటీకా అనే సందగ్ధంలో వుండిపోయింది. ఇదిలా వుంటే మాస్ రాజా రవితేజ చిత్రం `క్రాక్` కూడా ఓటీటీకే వచ్చేస్తోందంటూ వరుస కథనాలు వినిపిస్తున్నాయి. ఓటీటీలో రిలీజ్ చేస్తే తనకేమీ అభ్యంతరం లేదని హీరో రవితేజ చిత్ర బృందంతో ఇప్పటికే చెప్పేశారట. అయితే దర్శకుడు గోపీచంద్, నిర్మాత ఠాగూర్ మధు మాత్రం అందుకు సుముఖంగా లేనట్టు తెలిసింది.
జీ టీవీ వారు ఈ చిత్రాన్ని జీ5లో స్ట్రీమింగ్ కోసం సంప్రదించారు. అయితే డీల్ కుదరకపోవడంతో మేకర్స్ అంగీకరించలేదు. తాజాగా మరోసారి `క్రాక్` ఓటీటీకే వచ్చేస్తోందంటూ వార్తలు షికారు చేస్తున్న నేపథ్యంలో దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ పుకార్లపై స్పష్టత నిచ్చారు. `క్రాక్` థియేటర్లలో మాత్రమే రిలీజ్ అవుతుందని, ఓటీటీలో రిలీజ్ కాదని సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.