కన్నడ చిత్రం `కిరిక్ పార్టీ`తో రష్మిక మందన్నసినిమా రంగంలో అడుగుపెట్టింది. `ఛలో` వంటి హిట్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ సోయగం అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ రష్మిక ప్రస్తుతం యమ బిజీగా వుంది. ఒక విధంగా చెప్పాలంటే కెరీర్లో అత్యుత్తమ ఫేజ్ని ఎంజాయ్ చేస్తోంది. ఇదే ఏడాది
బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్లో `మిషన్ మజ్ను`.. తెలుగులో అల్లు అర్జున్తో `పుష్ప` వంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది. ఇక తమిళ ఇండ్ట్రీలోకి ఇదే ఏడాది ఎంట్రీ ఇస్తున్న రష్మిక `సుల్తాన్` చిత్రంలో నటిస్తోంది. ఇందులో కార్తి హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ తెలుగులోనూ విడుదల కాబోతోంది. ఇదిలావుంటే కన్నడలో తను నటించిన `పొగారు` చిత్రం అదే పేరుతో తెలుగులో ఈ నెల 19న రిలీజ్ కాబోతోంది.
ఈ చిత్రంలో ధ్రువ సర్జా హీరోగా నటించాడు. ఈ చిత్ర ప్రమోషన్ కోసం రష్మిక ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే చిత్ర దర్శకుడు మాత్రం రష్మిక సహకరిస్తోందని, ప్రమోషన్లలో పాల్గొంటుందని మీడియాకు వివరించారు.. కానీ రియాలిటీ మాత్రం అందుకు విరుద్ధంగా వుండటంతో రష్మకపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.