పురచ్చి తలైవి, తమిళనాడు లో అందరూ అమ్మ అని మనసారా పిలుచుకునే దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ప్రస్తుతం 3 సినిమాలు రాబోతున్నాయి. తమిళ్ బయోపిక్ అంటే మామూలు విషయం కాదు. అక్కడ ప్రజలు ఎంతో సున్నితంగా ఉంటారు. ఒక్క అక్షరం మాట అటు ఇటు అయినా, రాష్ట్రం భగ్గుమంటుంది. అందులోనూ, జయలలిత లాంటి వారి విషయంలో ఆధారాలున్నప్పటికీ ఎ మాత్రం నెగటివ్ గా, వివాదస్పదం గా చూపించే ధైర్యం రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు కూడా చెయ్యరు. ప్రస్తుతం ఆ 3సినిమాల మేకర్స్ ఎవరూ కూడా, తాము నేరుగా జయలలిత జీవితంపై సినిమాలు చెయ్యడం లేదని, ఒక కల్పిత పాత్ర ఆధారంగానే చేస్తున్నామని ప్రకటించారు.
కంగన రనౌత్ హీరోయిన్ గా తలైవి ; నిత్యా మీనన్ హీరోయిన్ గా ది ఐరన్ లేడీ; రమ్యకృష్ణ హీరోయిన్ గా క్వీన్ వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. ఇప్పటిదాకా కోర్టులలో నలిగిన వాదనల తరువాత అన్నిటికీ క్లీన్ చిట్ వచ్చింది. అయితే ఈ ముగ్గురిలో ఎవరు జయలలిత క్యారెక్టర్ బాగా చేసారు.? అనే పోలికలు మొదలయ్యాయి. అయితే తమిళ సినిమా ప్రేక్షకులు, అమ్మ అభిమానులు ఎక్కువ శాతం రమ్యకృష్ణ కే ఓటు వేస్తున్నారు.
క్వీన్ వెబ్ సిరీస్ లో రమ్య కృష్ణ అచ్చం జయలలిత లాగానే ఉన్నారని, పోలికలు, అందం, అభినయం, నటన అన్నీ అద్భుతమని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. జయలలిత జీవితం, ఆమె బాల్యం, విద్యాభ్యాసం, విద్యార్ధిని దశ నుండే ఆమె నాయకత్వ పటిమ, సినీ జీవితం,స్వర్గీయ ఎంజీఆర్ తో అనుబంధం, ఆమె రాజకీయ ప్రవేశం, ఆమె ఎదుర్కొన్న అవమానాలు, ఆమె సాధించిన విజయాలు, ముఖ్యమంత్రిగా ఆమె చేసిన సంస్కరణలు ఇలా అన్నీ ఆమె గురించి మంచి విషయాలే ఈ సినిమాలన్నిట్లో ఉండబోతున్నాయి.