కరోనా వైరస్ కారణంగా సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. కొన్ని సినిమాల షూటింగ్లని కూడా వాయిదా వేస్తున్నారు. అయితే `ఇస్మార్ట్ శంకర్` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకున్న రామ్ అంతే ఎనర్జీతో తాజా చిత్రాన్ని మాత్రం అనుకున్న డేట్కి, అనుకున్న సమయానికే రిలీజ్ చేస్తున్నాడు. ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న తాజాచిత్రం `రెడ్`. తమిళ హిట్ చిత్రం `థడమ్` ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ బ్యానర్పై స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న రిలీజ్ కాబోతోంది. ఇటీవలే రిలీజ్ డేట్ని ప్రకటించారు. అయితే కరోనా ఎఫెక్ట్ కారణంగా చాలా సినిమాలు రిలీజ్ డేట్లని మార్చుకుంటున్న ఈ తరుణంలో `రెడ్` రిలీజ్ కూడా మారే అవకాశం వుందని ప్రచారం మొదలైంది. అయితే తాజాగా ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ ముందు ఫిక్సయిన డేట్కే `రెడ్` రిలీజ్ అవుతుందని నిర్మాత క్లారిటీ ఇచ్చారు.
నిర్మాత స్పీడుకు తగ్గట్టే సినిమా బిజినెస్ కూడా యమ స్పీడుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. రామ్ గత చిత్రాలకు మించి ఈ సినిమాకి మంచి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయట. నైజాంతో పాటు ఆంధ్రా, సీడెడ్ ఏరియాల్లో ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులకు భారీ రేటే పలికినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మాళవికాశర్మ, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో హేబా పటేల్ స్పెషల్ హాట్ నంబర్ చేస్తోంది.