ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రభావం, స్మార్ట్ ఫోన్ల వాడకం స్టార్ హీరోల సినిమాలకు షాపంగా మారింది. ఎలాంటి విషయమైనా వెంటనే బయటికి లీక్ అయిపోతోంది. ఎంత మందిని కట్టడి చేసినా ఏదో ఒక రూపంలో సినిమాకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో లీక్ అవుతూ సినీ వర్గాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల చిరంజీవి, కొరటాల కాంబినేషన్లో వస్తున్న సినిమాకు సంబంధించిన పిక్స్ లీక్ అయి వైరల్ అయిన విషయం తెలిసిందే.
ప్రతిష్టాత్మకంగా రాజమౌళి రూపొందిస్తున్న `ఆర్ ఆర్ ఆర్` కి సంబంధించిన స్టిల్స్ బయటికి లీక్ కావడం వెలిసిందే. పులితో యంగ్టైగర్ ఎన్టీఆర్ ఫైట్ చేస్తున్న ఓ ఫొటో లీక్ కావడంతో రాజమౌళి టీమ్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినంత పని చేశారట. తాజాగా కల్యాణ్రామ్ కూడా అలాంటి వార్నింగ్ని తన టీమ్కి ఇచ్చినట్టు తెలిసింది. నందమూరి కల్యాణ్రామ్ హీరోగా సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై ఓ పిరియాడిక్ సోషియో ఫాంటసీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 13వ శతాబ్దం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే సైలెంట్గా రామోజీ ఫిల్మ్ సిటీలో స్టార్ట్ అయింది.
ప్రత్యేకంగా వేసిన రాజమహల్ సెట్లో షూటింగ్ జరుగుతోంది. రాజు గెటప్లో కల్యాణ్రామ్ పై పలు కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఇటీవల సెట్లో నుంచి మిగతా చిత్రాల స్టిల్స్ లీక్ అవుతున్న విషయాన్ని సీరియస్గా తీసుకున్న కల్యాణ్రామ్ సెట్లోకి ఎవరూ ఫోన్లు తీసుకురావద్దని కండీషన్ పెట్టారట. దీంతో సెట్లో ఎవరూ ఫోన్లు వాడటం లేదని తెలిసింది. ఈ చిత్రానికి `రావణ్` అనే టైటిల్ని రిజిస్టర్ చేయించారు. అదే ఫైనల్ అయ్యేలా కనిపిస్తోంది.