కరోనా ఎఫెక్ట రోజు రోజుకీ ఎక్కువవుతోంది. దీని తీవ్రత మరీ ఎక్కువవుతుండటం, దేశంలో మరణాలతో పాటు పాజిటివ్ కేసులు కూడా దాదాపు 600 లకు చేరుకోవడంతో 21 రోజుల పాటు దేశ ప్రధాని మోదీ లాక్ డౌన్ ప్రకటించారు. దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతుందని తెలిసినా దేశ ప్రజలని రక్షించాలనే ఉద్దేశంలో లాక్ డౌన్ ప్రకటించారు.
దీంతో దేశంలోని అన్ని సంస్థలు, ముఖ్యంగా షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు ఏప్రిల్ 15 వరకు బంద్ చేయక తప్పని పరిస్థితి. దీంతో చాలా వరకు సినిమాల రిలీజ్లు వాయిదా వేయాల్సిన పరిస్థితి. రామ్ నటిస్తున్న తాజా చిత్రం `రెడ్`. క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతున్న చిత్రమిది. తమిళ హిట్ చిత్రం `తడమ్` ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకుడు. స్రవంతి రవికిషోర్ స్రవంతి మూవీస్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
హీరో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ముందు ఏప్రిల్ 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. లాక్ డౌన్ ఏప్రిల్ 15 వరకు పొడిగించడంతో ఈ చిత్ర రిలీజ్ని వాయిదా వేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అంతా సేఫ్గా వుండాలని కోరుకుంటున్నాం. ఈ పరిస్థితి అతి త్వరలోనే మారుతుందని భావిస్తున్నాం. రిలీజ్ విషయంలో మాకు ఎలాంటి తొందర లేదని, త్వరలోనే రిలీజ్ డేట్ని ప్రకటిస్తామని చిత్ర బృందం ప్రకటించింది.