`పతాహై మై కౌన్ హూం.. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్.. అంటూ `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు ఎనర్జిటిక్ హీరో రామ్. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ ఉత్సాహంతో సొంత నిర్మాణ సంస్థ స్రవంతీ మూవీస్లో రామ్ `రెడ్` పేరుతో కొత్త సినిమా చేస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రానికి తమిళ హిట్ చిత్రం `థడమ్` ఆధారం.
రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మాళవిక శర్మ, నివేదా పుతురాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇటీవలే ఇటలీలోని మంచు కొండల్లో రెండు పాటల్ని చిత్రీకరించారు. కీలక షెడ్యూల్ని పూర్తి చేసిన ఈ చిత్ర టీమ్ తాజా షెడ్యూల్ని హైదరాబాద్లో మొదలుపెట్టబోతోంది. ఇదే ఫైనల్ షెడ్యూల్. దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాపై రామ్ భారీ అంచనాలే పెట్టుకున్నాడు. తమిళ మాతృకలో మార్పులు చేసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇందులో `ఇస్మార్ట్ శంకర్` తరహాలో కొత్త రామ్ని చూస్తారని, సినిమా కొత్త ఫీల్ని కలిగిస్తుందని రామ్ ఇటీవల సినిమాపై తనకున్న కాన్ఫిడెంట్ని వెల్లడించాడు. అతని మాటలకు తగ్గట్టుగానే సినిమా వుంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని ఏప్రిల్ 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.