కరోనా వైరస్ భారత్లోకి ఎంటరైన క్షణం నుంచి కరోనాపై కవితలు రాస్తున్న ఏకైక డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ. ఈ వైరస్ని ఎలా వాడితే వైరల్గా మారుతుందో అంతకు మించి వాడటం మొదలుపెట్టాడు. లాక్డౌన్ టైమ్ని సినిమా షూటింగ్కి వాడుకున్న వర్మ `క్లైమాక్స్` పేరుతో రచ్చకు తెరలేపిన విషయం తెలిసిందే. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ఏకంగా ఫిల్మ్ షూట్ చేసిన వర్మ తాజాగా మరో షాక్ ఇవ్వబోతున్నాడు.
ఈసారి కరోనా వైరస్ని టార్గెట్ చేసిన వర్మ దీన్ని నేపథ్యంగా చేసుకుని ఫీచర్ ఫిల్మ్ని తెరకెక్కించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తమ సినిమాల షూటింగ్ మొదలుపెట్టడానికి స్టార్ డైరెక్టర్లు మీన మేశాలు లెక్కిస్తుంటే వర్మ మాత్రం అనుకున్నదే తడవుగా అన్నంతపని చేయడం ఇండస్ట్రీ వర్గాలని విస్మయానికి గురిచేస్తోంది.
`కరోనా వైరస్ పేరుతో ఓ ఫీచర్ ఫిల్మ్ చేశాను. ఈ సినిమా మొత్తాన్ని లాక్డౌన్ పిరియడ్లో చేశాం. కరోనా వైరస్ పై ప్రపంచంలోనే తొలిసారి తీసిన సినిమా ఇది. మా నటీనటులు, ఇతర సిబ్బంది తమ క్రియేటివిటీని ప్రదర్శించారు. లాక్డౌన్లో వున్నా వాళ్లు లాక్డౌన్ కాలేదు. 26 సాయంత్రం 5 గంటలకు ట్రైలర్ను విడుదల చేస్తున్నాం` అని ట్వీట్ చేశారు.