మంచు మనోజ్ హీరోగా కొంత విరామం తరువాత చేస్తున్న చిత్రం `అహం బ్రహ్మస్మి`. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. మంచు మనోజ్ స్వయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అత్యంత భారీ స్థాయిలో ఓ విజువల్ వండర్గా రూపొందనున్న ఈ మూవీ శుక్రవారం హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మెగా హీరో రామ్చరణ్ క్లాప్ నిచ్చి ప్రారంభించారు.
తెర వెనుక హీరోల మధ్య అపోహలు వుంటాయని చాలా ప్రచారం వుంది. ముఖ్యంగా మంచు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య అపోహలు వున్నాయని ప్రచారం జరిగింది. ఇటీవల జరిగిన `మా` డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో తమ ఇరు కుటుంబాల మధ్య ఎలాంటి అపోహలు లేవని, తామిద్దరం మంచి స్నేహితులమని మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్కింగ్ మోహన్బాబు స్పష్టం చేశారు.
తాజాగా మంచు మనోజ్ `అహం బ్రహ్మస్మి` చిత్ర ప్రారంభోత్సవానికి మెగా పవర్స్టార్ రామ్చరణ్ హాజరై మరింత క్లారిటీ ఇచ్చారు. రామ్చరణ్ తన ప్రాణస్నేహితుడని, అందుకే ఈ కార్యక్రమానికి వచ్చాడని మంచు మనోజ్ ప్రకటించడంతో ఇరు కుటుంబాల మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం నెలకొందని, బయట జరుగుతున్న ప్రచారంలో అర్థం లేదని స్పష్టత వచ్చింది. దీంతో ఇరు కుటుంబాల ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఇలాంటి ఆరోగ్యకర వాతావరణం వుండాలని కోరుకుంటున్నారు. మనోజ్ నటిస్తున్న `అహం బ్రహ్మస్మి` ఈ నెల 11 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. మే నెలలో 35 రోజుల పాటు యాక్షన్ ఘట్టాల్ని చిత్రీకరించబోతున్నారు.