కరోనా ప్రతీ రంగాన్ని కుదేలయ్యేలా చేస్తోంది. దీని ధాటికి ఇప్పటికే కొన్ని రంగాలు కోలుకోలేని పరిస్థితికి చేరుకున్నాయి. మరి కొన్ని దీనావస్థకు చేరువవుతున్నాయి. ఇక సినిమా రంగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అన్ని రంగాల కంటే భారీ నష్టాల్లోకి కూరుకుపోయిన రంగం ఏదైనా వుందంటే అది సినిమా రంగమే. కరోనా దెబ్బతో షూటింగ్లు బంద్, థియేటర్లు బంద్, రిలీజ్లు బంద్.. ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడాలని చాలా సంస్థలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
ఇక కొన్ని చిత్రాల స్క్రిప్ట్లని కూడా కరోనా మార్చేస్తోంది. తాజాగా మెగాస్టార్ నటిస్తున్న `ఆచార్య` మూవీ స్క్రిప్ట్ని ప్రస్తుత పరిస్థితుల కారణంగా మార్చనున్నట్టు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. స్క్రిప్ట్ ప్రకారం ఇందులో అభ్యుదయ భావాలుగల ఓ స్టూడెంట్ లీడర్గా 45 నిమిషాల నిడివితో ఓ పాత్ర వుంది. ఆ పాత్రలో రామ్చరణ్ నటిస్తారంటూ గత కొన్ని నెలలుగా వార్తలు వినిపిస్తున్నాయి.
చిరంజీవి కూడా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు కూడా. ఇదిలా వుంటే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్ర కథకు కీలకంగా వున్న రామ్చరణ్ పాత్ర నిడివిని తగ్గించారని, ఆయన పాత్రని అతిథి పాత్రకు కుదించారని వార్తలు వినిపిస్తున్నాయి. `ఆర్ ఆర్ ఆర్`లో నటిస్తున్న రామ్చరణ్ డేట్స్ సమస్య తలనొప్పిగా మారడంతో మేకర్స్ తాజా మార్పులు చేయాలనే ఆలోచనకు వచ్చారని తాజా సమాచారం.