కరోనా వైరస్ అనుకున్న దానికన్నా ఎక్కువగానే ఇండియాను తాకింది. ఇక్కడ వేడి వల్ల వైరస్ బ్రతకదని, భయపడాల్సిన అవసరం లేదని అనుకున్నారు కానీ చూస్తుండగానే భారతదేశంలో కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 120కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో థియేటర్లు, షాపింగ్ మాల్స్, మ్యూజియం, పబ్స్ వంటివన్నీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. గుంపులుగా బయట తిరగొద్దని తెలిపింది. ఇలా పలు సూచనలు చేసింది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తోంది ప్రభుత్వం. అయితే ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు పూనుకుంది. ఎందుకంటే ఎవరెంత చెప్పినా మనకేం కాదులే అన్నట్లుగానే మెజారిటీ ప్రజలు ఉంటున్నారు. అందుకే వాళ్లలో అవగహన పెంచేందుకు ఆర్ ఆర్ ఆర్ లో కలిసి నటిస్తోన్న రామ్ చరణ్, ఎన్టీఆర్ ముందుకు వచ్చారు.
ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పిన వీడియో వైరల్ అవుతోంది. వారు చెప్పినదాని ప్రకారం వీలైనన్ని ఎక్కువ సార్లు చేతిని, గోళ్లను కడుక్కోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి, గోరు వెచ్చటి నీళ్ళైతే మరీ మంచిది. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా రోజంతా తాగండి. వాట్సాప్ లో వచ్చే ప్రతీ మెసేజ్ నూ నమ్మకండి. అనవసరంగా భయభ్రాంతులకు గురవ్వకండి. దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు చేతితో కాకుండా మోచేతిని అడ్డు పెట్టుకోండి. షేక్ హ్యాండ్స్, కౌగిలింతలు మానేయండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్ సైట్ లో ఎప్పటికప్పుడు ఇచ్చే సమాచారాన్ని తెలుసుకుని దాని ప్రకారం నడుచుకోండి.
మనందరం కలిసి దీన్ని అరికట్టగలం. పరిశుభ్రంగా, సురక్షితంగా ఉందాం. మనల్ని మనమే కాపాడుకుందాం అని ఈ ఇద్దరూ కలిసి మెసేజ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఈ వీడియోకు 10 వేల కంటే ఎక్కువ రీట్వీట్లు వచ్చాయి.
వీరు ఇచ్చిన మెసేజ్ తో పాటు ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరి లుక్స్ చూసుకుని వారి వారి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇద్దరికి ఇద్దరూ అదిరిపోయానని కామెంట్లు చేస్తున్నారు.