ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనాకు భయపడుతోంది. స్కూళ్ళు, కాలేజీలు బంద్ అవుతున్నాయి. థియేటర్లు మూసివేస్తున్నారు. సినిమాలను వాయిదా వేస్తున్నారు. షాపింగ్ మాల్స్, పబ్స్, ఇలా సనసమూహం ఉండకుండా అన్ని పబ్లిక్ ఏరియాలను మూసేస్తున్నారు. స్వచ్ఛందంగా సినిమా వాళ్ళు సైతం తమ షూటింగ్ లను నిలిపివేస్తున్నారు. 10 లేదా 15 రోజుల తర్వాత తిరిగి షూటింగ్ చేయాలనుకుంటున్నారు. చిరంజీవి నటిస్తోన్న ఆచార్య షూటింగ్ ను నిలిపివేశారు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కూడా ఇబ్బందుల్లో పడింది. ఇంత జరుగుతున్నా కానీ ప్రభాస్ టీమ్ దేన్నీ లెక్క చెయ్యట్లేదు.
ప్రస్తుతం ప్రభాస్20 చిత్రం కోసం టీమ్ జార్జియాలో షూటింగ్ చేస్తోన్న విషయం తెల్సిందే. కరోనా భయాల మధ్యే జార్జియా పయనమైన ప్రభాస్ అండ్ కో, ఆ వైరస్ వ్యాపిస్తున్నా కానీ లెక్క చేయకుండా షూటింగ్ ను కానిస్తున్నారు. మొన్ననే కరోనాకు భయపడకుండా హీరోయిన్ పూజ హెగ్డే జార్జియా వెళ్లిన విషయం తెల్సిందే. ఇప్పుడు టాప్ కమెడియన్ గా కొనసాగుతున్న ప్రియదర్శి కూడా కరోనా ఎఫెక్ట్ ను లెక్క చేయకుండా టీమ్ తో జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని అధికారికంగా తన సోషల్ మీడియా పేజ్ లో కూడా పెట్టాడు.
మరి కొన్ని రోజులు జార్జియాలో ప్రభాస్ సినిమా షూటింగ్ జరగనుంది. ఇప్పటికే వివిధ కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమైంది. అందుకే మరింత ఆలస్యమైతే అక్టోబర్ లో రావాలనుకున్న వారి ప్లాన్స్ బెడిసికొడతాయి కాబట్టి కరోనా భయాల మధ్య కూడా డేర్ చేసి షూటింగ్ చేస్తున్నారు. నిన్ననే దర్శకుడు రాధా కృష్ణ కుమార్ తమ టీమ్ అవాంతరాలు ఎన్ని ఎదురైనా లెక్క చేయకుండా తమ టీమ్ షూటింగ్ చేస్తోందని గర్వంగా చెప్పుకున్నాడు.
ఈ చిత్రానికి ఓ డియర్ లేదా రాధే శ్యామ్ అనే టైటిల్స్ ను కన్సిడర్ చేస్తున్నారు. ఉగాదికి ఈ చిత్ర ఫస్ట్ లుక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది.