ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విళయతాండవ చేస్తోంది. దీంతో ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీతమ ప్రజలని రక్షించుకోవడం కోసం లాక్ డౌన్ని ప్రకటించాయి. మన దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ని విధించింది. దీంతో ఎక్కడి వాళ్లు అక్కడే ఇళ్లల్లో వుండిపోయారు. లాక్డౌన్ కారణంగా అన్ని సంస్థలు బంద్ ప్రకటించడంతో సినిమా థియేటర్లు, షూటింగ్లు స్థింభించిపోయాయి.
దీంతో కార్మికుల సహాయార్థం స్టార్స్ అంతా ముందుకొచ్చి భారీ స్థాయిలో విరాళాలు ప్రకటిస్తున్నా సోనీ ఇండియా నెట్వర్క్, కల్యాణ్ జువెల్లర్స్ కలిసి `ఫ్యామిలీ` పేరుతో ఓ కామెడీ షార్ట్ ఫిల్మ్ని రూపొందించారు. ప్రసూన్ పాండే దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిల్మ్ ఇటీవలే సోనీ టీవీలో ప్రసారమైంది.
ఇందులో అబితాబ్ బచ్చన్ , రజనీకాంత్, చిరంజీవి, మోహన్లాల్, మమ్ముట్టి, శివరాజ్కుమార్, రణ్బీర్ కపూర్, ప్రియాంక చోప్రా, అలియాభట్, దిల్జీత్ దొసాంజే తదితరులు నటించారు. ఎక్కడివాళ్లు అక్కడే వుంటే మరీ షార్ట్ ఫిల్మ్ ఎలా తయారైంది? అనే అనుమానం అందరిలోనూ మొదలైంది. అయితే `ఫ్యామిలీ` అనే పేరుకు తగ్గట్టే ఈ షార్ట్ ఫిల్మ్లోని అమితాబ్ పార్ట్ని అభిషేక్ బచ్చన్, రజనీ పార్ట్ని ఆయన కూతురు సౌందర్య, ..ఇలా ఎవరి వాళ్లు వాళ్లకు సంబంధించిన వాళ్ల వెర్షన్ని షూట్ చేశారట ఈ విషయాన్ని దర్శకుడే స్వయంగా బయట పెట్టాడు.