బాహుబలి సినిమాతో ప్రభాస్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా విజయంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఆ తరువాత చేసిన `సాహో` కూడా పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకోవడంతో ఆయన తదుపరి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. `సాహో` హిట్ అనిపించుకున్నా ఆశించిన స్థాయిలో మాత్రం వసూళ్లని కాబట్టలేకపోయింది. దీంతో ఆలోచనలో పడ్డ ప్రభాస్ తన తదుపరి చిత్ర కథలో కొన్ని మార్పులు చేయించినట్టు తెలిసింది. ప్రభాస్ ప్రస్తుతం `జాన్` చిత్రంలో నటిస్తున్నారు.
`జిల్` ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. యువీ సంస్థ నిర్మిస్తోంది. `బాహుబలి, సాహో చిత్రాల్లో కొంత బరువు పెరిగి కనిపించిన ప్రభాస్ తాజా చిత్రం `జాన్` కోసం బరువు తగ్గి స్టన్నింగ్ లుక్తో కనిపిస్తున్నారు. ఇటీవల కీరవాణి తనయులు శ్రీసింహా, కాలభైరవ `మత్తు వదలరా` చిత్రంతో పరిచయమైన విషయం తెలిసిందే. ఈ సినిమా టీమ్ని అభినందించిన ప్రభాస్ వారితో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. స్లిమ్గా షాకింగ్ లుక్లో కనిపిస్తున్న ప్రభాస్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. `మిస్టర్ పర్ఫెక్ట్` చిత్రంలో ప్రభాస్ స్లిమ్గా కనిపించారు. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఈ ఫొటోల్లోనూ ప్రభాస్ అదే స్థాయిలో కనిపిస్తుండటం ఆకట్టుకుంటోంది.
ప్రభాస్ `జాన్` తరువాత `అర్జున్రెడ్డి` ఫేమ్ సందీప్ వంగ చిత్రంలో నటించనున్నారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. `డెవిల్` పేరుతో సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాలోనూ ప్రభాస్ స్టైలిష్ లుక్తో కనిపించనున్నారట. అందు కోసమే ఆయన బరువు తగ్గారని, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాల్ని చిత్ర బృందం వెల్లడించనుందని తెలిసింది.