సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల `లీడర్` చిత్రం ద్వారా పరిచయం చేసిన హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ గుర్తుందా?. ప్రభాస్ నటించిన `మిర్చీ` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ని అందుకున్న రిచా `భాయ్` సినిమా తరువాత నటనకు గుడ్బై చెప్పేసి ఉన్నత చదువుల కోసం అమెరికా చెక్కేసింది. తాజాగా ఆమె వివాహం చేసుకుంది. జనవరిలోనే తను ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించి షాకిచ్చిన రిచా అన్నట్టుగానే తన బాయ్ ఫ్రెండ్ జోను వివాహం చేసుకున్నారు. ఆ సందర్భంలోనే తనకు కాబోయే భర్తతో దిగిన ఫొటోని సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
రెండేళ్ల క్రితం బిజినెస్ స్కూల్లో జో అనే ఫారినర్తో పరిచయం ఏర్పడిందని, అదే ప్రేమగా మారిందని రిచా వెల్లడించింది. ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ప్రకటించిన రిచా పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాలేదని తెలిపింది. తాజాగా తను ప్రేమించిన జో నే ప్రేమ వివాహం చేసుకుంది. జో క్రిస్టియన్, రిచా హిందువు కావడంతో వీరి పెళ్లి రెండు మతాల సంప్రదాయాల ప్రకారం జరినించారు. ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్న ఫారినర్స్ కూడా తెలుగు దనం ఉట్టిపడే భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కనిపించడం పలువురిని ఆకట్టుకుంటోంది.
రిచా ప్రేమ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే రిచా తన అధికారిక ట్విట్టర్ పేజీలో మాత్రం ఎలాంటి ఫొటోలని ఇంకా పోస్ట్ చేయలేదు. రిచా గంగోపాధ్యాయ తెలుగు, తమిళ, బెంగాళీ భాషల్లో కలిపి 9 చిత్రాల్లో నటించింది. 2013 నుంచి సినిమాకు గుడ్ బై చెప్పేసి అమెరికా వెళ్లిపోయారు. ట్విట్టర్ ద్వారా అభిమానులు మళ్లీ నటించమని కోరినా రిచ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇక ఆమె శాశ్వతంగా సినిమాకు ఫుల్స్టాప్ పెట్టేసిందని అందరికి అర్థమైంది. దాంతో ఏ నిర్మాత కూడా ఆమెని సంప్రదించే ప్రయత్నాలు చేయలేదు.