పవర్స్టార్ పవన్కల్యాణ్ నటించిన చిత్రం `బద్రి`. పూరిజగన్నాథ్ దర్శకుడిగా తెరంగేట్రం చేసిన చిత్రమిది. 2000 ఏప్రిల్ 20న ఈ చిత్రం విడుదలైంది. `ఏయ్ నువ్వు నందా అయితే.. నేను బద్రీ బద్రీనాథ్..` అంటూ పవన్ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ యూత్ని ఉర్రూతలూగిస్తూనే వుంది. 20 ఏళ్ల క్రిందట విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది.
త్రవిక్రమరావు నిర్మించిన ఈ చిత్రం పవన్ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. రేణు దేశాయ్ కూడా ఈ చిత్రం ద్వారానే హీరోయిన్గా పరిచయమైంది. అమీషా పటేల్ ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రమిది. రామ్గోపాల్వర్మ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన పూరి జగన్నాథ్ ఈ సినిమా కార్యరూపం దాల్చడానికి పెద్ద యజ్ఞమే చేశాడు. పవన్ని కథ చెప్పడం కోసం ఉదయం 4 గంటలకే వెళ్లి ఇంటి ముందు పడిగాపులు కాశాడు కూడా. శ్యామ్ కె. నాయుడు ద్వారా పరిచయమైన చోటా కె నాయుడు అండతో పవన్కు కథ చెప్పేందుకు పూరి వెళ్లారు. అయితే పవన్ దాకా వెళ్లానికి పూరి చెప్కపిన కథ `బద్రి` కాదు `ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం.
ఈ కథ నచ్చడం వల్లే పవన్కు కథ చెప్పే అవకాశాన్ని పూరికి చోటా కె నాయుడు కలిపించారట. ఇన్ని ప్లాన్లు చేసుకుని పవన్ దాకా వెళితే అరగంట మాత్రమే అది కూడా తెల్లవారు జామున 4 గంటలకు వచ్చి చెప్పాలని కండీషన్ పెట్టారట. పవన్ చెప్పినట్టే తెల్లవారు జామున 4 గంటలకే పవన్ ఇంటికి వెళ్లి కథ చెప్పడం మొదలుపెట్టారట పూరి.. అరగంట అయింది.. గంట.. నాలుగు గంటలు పూర్తయ్యాయి. పవన్కు కథ విపరీతంగా నచ్చింది కానీ క్లైమాక్స్ మాత్రం నచ్చ లేదు. మార్చమని చెప్పారట. పూరి మాత్రం మార్చడానికి అంగీకరించలేదు. వారం పాటు మార్చడానికి ప్రయత్నించి చివరికి పవన్కు వెళ్లి చెప్పారట.
అయితే తన కోసం మారుస్తావా లేదా? అని చూశానని, ఈ క్లైమాక్సే తనకు నచ్చిందని పవన్ చెప్పడంతో సినిమా సాఫీగా తెరపైకొచ్చింది.