కరోనాపై తెలుగు సినీ ఇండస్ట్రీ యుద్ధం ప్రకటించింది. కేంద్ర, రాష్ట్రాలు కరోనా కట్టడికి చేస్తున్న ప్రయత్నాలకు తాము కూడా సిద్ధం అంటూ ముందుకొచ్చాయి. వరుస విరాళాలని ప్రకటిస్తూ ఆర్థికంగా తమ సపోర్ట్ని తెలియజేశాయి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అత్యధికంగా కరోనాపై యుద్ధం కోసం విరాళాలు రావడం తెలిసిందే. దీనిపై జనసేనాని, స్టార్ హీరో పవర్స్టార్ పవన్కల్యాణ్ స్పందించారు. సినీ కార్మికుల కోసం కోటి సహాయం ప్రకటించిన చిరుకు తమ్ముడిని అయినందుకు గర్వంగా వుంది అన్నారు.
సినిమా పరిశ్రమకు ఎలాంటి కష్టం వచ్చినా స్పందించే నా పెద్దన్నయ్య సినీ కార్మికుల కోసం కోటి విరాళం ప్రకటించినందుకు ఆయన తమ్ముడిగా గర్వపడుతున్నాను. సినీ పరిశ్రమలో వున్న 24 విభాగాల్లో వున్న ప్రతీ శ్రామికుడి కష్టం తెలిసిన వ్యక్తి చిరంజీవి. సినిమానే నమ్ముకుని జీవిస్తూ కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన ఎందరో కార్మికులు, టెక్నీషియన్లు ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నారు. అలాంటి వారిని ఆదుకోవడానికి పెద్దన్నయ్యగా ముందుకు వచ్చిన చిరంజీవిని అభినందిస్తున్నాను అన్నారు పవన్.
4 కోట్లు విరాళం ప్రకటించిన ప్రభాస్ తన పెద్ద మనసును చాటుకున్నారు. సమాజ క్షేమం గురించి ఆలోచించే మహేష్ కోటి విరాళం ప్రకటించారు. నా అన్న కుమారుడు రామ్చరణ్ తండ్రి అడుగుజాగల్లో నడుస్తూ 70 లక్షలు ప్రకటించి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. మరో యువ శక్తి తారక్ 75 లక్షలు ప్రకటించడం ముదావహం అన్నారు. 20, 10, 5లక్షలు ప్రకటించిన వారిని కూడా ప్రత్యేకంగా కొనియాడారు. ప్రకాష్రాజ్ని మాత్రం ప్రత్యేకంగా పొగిడారు.