`అజ్ఞాతవాసి` ఫ్లాప్ తరువాత సినిమాలకు బ్రేకిచ్చిన పవన్కల్యాణ్ జనసేన పార్టీ కార్యకలాపాల్లో పూర్తిగా లీనమైపోయారు. ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారిన పవన్ ఇక సినిమాలు చేయడం కష్టమనే సంకేతాలు మొదలయ్యాయి. దీనికి తోడు పవన్ కూడా మళ్లీ సినిమాల్లోకి తాను రావడం కుదిరేలా లేదనే సంకేతాల్ని అందించారు. అయితే ఫ్యాన్స్ మాత్రం సినిమాల్లో కంటిన్యూ కావాల్సిందే అంటూ పవన్పై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో పవన్ తన మనసు మార్చుకోవాల్సి వచ్చింది.
పవన్ `పింక్` ఆధారంగా రూపొందుతున్న తెలుగు రీమేక్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం కోర్టు హాల్ని సిద్ధం చేస్తుంటే పవన్ కూడా ఆ సినిమా కోసం రెడీ అయిపోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఒకేసారి పవన్ రెండు చిత్రాల్ని పట్టాలెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. `పింక్` రీమేక్తో పాటు పవన్ దర్శకుడు క్రిష్ చిత్రానికి కూడా ఓకే చెప్పేశారట.
క్రిష్తో ఓ పిరియాడిక్ డ్రామాను చేయబోతున్నారట. ప్రీ ఇండిపెండెన్స్ కాలం నాటి కథతో ఈ సినిమా వుండబోతోందని తెలిసింది. దీనికి సంబంధించిన లుక్ టెస్ట్ని ఈ మధ్యే జరిగిందని తెలిసింది. ఈ సినిమా కోసం పవన్కు జోడీగా పూజా హెగ్డేని అనుకుంటున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ని చేసే అవకాశం వుందని వినిపిస్తోంది.