`బాహుబలి` తరువాత దక్షిణాది సినిమా అందులోనూ టాలీవుడ్ సినిమా బడ్జెట్ మరీ పెరిగిపోయింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో గత కొంత కాలంగా తెలుగులో భారీ చిత్రాల నిర్మాణం మొదలైంది. అలాంటి చిత్రాలపై ప్రేక్షకులు ప్రత్యేక ఆసక్తిని చూపిస్తుండటంతో మేకర్స్ కూడా ఈ తరహా భారీ చిత్రాల నిర్మాణానికే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు.
తాజాగా ఇదే కోవలో మరో భారీ బడ్జెట్ చిత్రం రాబోతోంది. రెండేళ్ల విరామం తరువాత పవర్స్టార్ పవన్కల్యాణ్ `పింక్` రీమేక్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాతో పాటు పవన్ మరో చిత్రాన్ని కూడా అంగీకరించిన విషయం తెలసిందే.
క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 29న హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో లాంఛనంగా ప్రారంభమైంది. పిరియాడిక్ డ్రామాగా తెరపైకి రాబోతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా అత్యంత భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. దీని కోసం ఏకంగా 100 కోట్ల ఖర్చు చేయబోతున్నారట. తాజ్మహల్, చార్మినార్ వంటి సెట్లతో పాటు ఓ కోటని కూడా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటికి రానున్నట్టు చిత్ర వర్గాల సమాచారం.