కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్కి OTTలు కెరాఫ్ అడ్రస్ గా మారాయి. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అప్రకటిత నిర్భంధం కొనసాగుతోంది. ఎక్కువగా జన సమూహాలుండే ప్రదేశాలని, మాల్స్ని, సినిమా థియేటర్లని తిరిగి ఇప్పట్లో ఓపెన్ చేసే అవకాశం లేకపోవడంతో సినీ వినోదానికి అలవాటు పడిన జనాలకు OTTలే ప్రధాన వినోద సాధనాలుగా మారాయి. ఈ నేపథ్యంలో చిన్న సినిమాల నుంచి క్రేజీ చిత్రాల వరకు అన్నీ ఓటీటీ వైపే చూస్తున్నాయి.
టాలీవుడ్లో OTTల బాట పడుతున్న చిత్రాల వరుస ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. గత కొన్ని నెలలుగా థియేటర్లో మాత్రమే తమ చిత్రాన్ని రిలీజ్ చేస్తామంటూ వచ్చిన దిల్ రాజు తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుని `వి` చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేస్తున్నారు. ఇదే బాటలో తమ చిత్రాన్ని కూడా రిలీజ్ చేయాలని ఓ సీనియర్ హీరో సినిమా కోసం సదరు నిర్మాతలు కొన్ని OTT ప్లాట్ ఫామ్లతో చర్చలు జరిపారట.
2009 వరుస పేలుళ్ల నేపథ్యంలో వాస్తవిక కోణంలో రూపొందుతున్న ఆ చిత్రాన్ని తీసుకోవడానికి సదరు OTT కంపనీలు అంగీకరించకపోగా ఈ తరహా చిత్రాన్ని తాము తీసుకోమని చెప్పడం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక సీనియర్ హీరో నటిస్తున్న చిత్రాన్ని ఓటీటీలు రిజెక్ట్ చేయడం విడ్డూరంగా వుందని పలువురు సినీ వర్గాలు OTTలపై పెదవి విరుస్తున్నారట.