ఇండస్ట్రీలో వున్న నిర్మాతల్లో సి.కల్యాణ్ శైలే వేరు. దాసరి నారాయణరావు వున్న సమయంలో ఆయనతో కలిసి కార్మికుల సమస్యలపై గళమెత్తిన ఆయన ఆ తరువాత ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా, దక్షిణభారత చలన చిత్ర సమాఖ్య అధ్యక్షుడిగా సేవలందించారు. ప్రస్తుతం నిర్మాతగా వరుస చిత్రాలతో బిజీ కావాలనుకుంటున్నారు. బుధవారం ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించి పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
గత ఏడాది నా పుట్టిన రోజు వేడుకలు తాజ్ కృష్ణ లో చిరంజీవి, బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి. కానీ ఈ ఏడాది నా పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం లేదు. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన చిత్ర సీమలో ఘోరాలు జరుగుతున్న నేపథ్యంలో చివరి నిమిషంలో చిత్రపురి ఎన్నికల్లో పోటీకి దిగాను. కాలనీకి సంబంధించిన వారు నన్ను పోటీకి దిగమన్నారు. దీంతో మీకు తోడుగా వుంటానని ఎన్నికల్లో నిలబడ్డాను` అన్నారు సి.కల్యాణ్
మరిన్ని వివరాలు వెల్లడిస్తూ `గత రెండేళ్లలో తాను స్టార్ హీరో నందమూరి బాలకృష్ణతో జైసింహా, రూలర్ వంటి చిత్రాలను నిర్మించాను. ఈ రెండు చిత్రాలు అనూహ్య విజయాన్ని సాధించాయి. త్వరలో నందమూరి బాలకృష్ణతో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నానని బాలయ్యతో ప్రయాణం ఎప్పుడూ ప్రత్యేకంగానే వుంటుందని సి. కల్యాణ్ అన్నారు. త్వరలో తాను చేయబోయే ప్రాజెక్ట్ల గురించి ఈ సందర్భంగా మరిన్ని వివరాల్ని వెల్లడించారు.
`1945` పేరుతో ఓ పిరియాడిక్ ఫిల్మ్ నిర్మిస్తున్నాను. ఇందులో రానా దగ్గుబాటి, సత్యదేవ్, రెజీనా కాసాండ్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదొక ప్రేమకథ. కరోనా మహమ్మారి కారణంగా ఈ చిత్రం ఆలస్యం అయ్యింది. ఏప్రిల్ లోనే రిలీజ్ చేయాలనుకున్నాం. కరోనా వల్ల అది సాధ్యపడలేదు. మంచి ఎమోషనల్ ఎంటర్టైనర్. దర్శకుడు సత్యశివ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల అవుతుంది. ‘బ్లఫ్ మాస్టర్’ కాంబినేషన్ సత్య దేవ్. దర్శకుడు గోపి గణేష్ పట్టాభితో ఓ మూవీ సెట్ చేశాను. ఈ మూవీ ఫిబ్రవరి 2021 నుండి ప్రారంభమవుతుంది. ఈ మూవీతో పాటు దర్శకుడు కె.ఎస్.రవి కుమార్ ఓ సినిమా ప్లాన్ చేశాను. ఓ స్టార్ హీరో ఇందులో నటిస్తారు. 2021 వేసవి నుండి సెట్స్పైకి వెళుతుంది.