నితిన్ టైమ్ స్టార్ట్ అయింది. ఇటీవల వరుసగా మూడు ఫ్లాపుల్ని ఎదుర్కొన్న నితిన్ `భీష్మ`తో సూపర్హిట్ని తన ఖాతాలో వేసుకుని మళ్లీ సక్సెస్ బాటపట్టాడు. ఈ సక్సెస్ ఇచ్చిన జోష్తో వున్న నితిన్ వెంటనే సోమవారం కొత్త చిత్రాన్ని ప్రారంభించేశాడు. ఆయుష్మాన్ ఖురానా, టాబు, రాధికా ఆప్టే కీలక పాత్రల్లో నటించిన బాలీవుడ్ చిత్రం `అంధాధున్`.
ఆయుష్మాన్ ఖురానా అంధుడిగా నటించిన ఈ చిత్రం జాతీయ పురస్కారాన్ని అందించి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదే చిత్రాన్ని తెలుగులో నితిన్ హీరో రీమేక్ చేస్తున్నారు. మేర్లపాగ గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై ఠాగూర్ మధు సమర్పణలో నితిన్ ఫాదర్ ఎన్. సుధాకర్రెడ్డి, నితిన్ సోదరి నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది.
ఎం. శ్యామ్ ప్రసాదరెడ్డి క్లాప్ నిచ్చారు. దిల్ రాజు కెమెరా స్విఛాన్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాత రాధాకృష్ణ స్క్రిఫ్ట్ని అందజేశారు. దర్శకుడు సురేందర్రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. హరి కె. వేదాంత్ కెమెరామెన్గా వర్క్ చేస్తున్నారు. ఇందులో నితిన్ అంధుడిగా ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. అయితే టాబు. రాధికా ఆప్టేల పాత్రల్ని ఎవరు చేస్తారన్నది మాత్రం ఇంకా స్పష్టం చేయలేదు.