మెగా వారసురాలు కొణిదెల నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రాల మధ్య వరుడు జొన్నలగడ్డ చైతన్య .. నిహారిక మెడలో మూడుముళ్లు వేసి ముట్టగా ఏడడుగులు వేశారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గల ఉదయ్విలాస్లో అత్యంత శోభాయమానంగా అలంకరించిన పెళ్లిపందిరిలో ఈ ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. బంగారు వర్ణం చీరలో నవ వధువు నిహారిక మెరిసింది. మెగా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు ఈ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొని నపూతన వధూవరుల్ని ఆశీర్వదించారు.
నిహారిక వివాహానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. సినీ నటులు, హీరోలతో పాటు నెటిజన్లు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారి జీవితం సంతోషం, ప్రేమతో నిండిపోవాలని కోరుకుంటున్నారు. పెళ్లికి ముందు రెండు రోజులు మెగా ఫ్యామిలీ హీరోలతో ఉదయ్విలాస్ కలర్ఫుల్గా మారిపోయింది. సంగీత్, మెహందీ కార్యక్రమాల్లో మెగా హీరోలు పాల్గొని సందడి చేశారు. చివరి నిమిషంలో ఉదయ్పూర్ చేరుకున్న పవన్కల్యాణ్ మెహెందీ వేడుకలో పాల్గొని ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు భావోద్వేగానికి లోనయ్యారు. `నా కుమార్తె తొలిరోజు పాఠశాలకు వెళుతున్నట్టుగా అనిపిస్తోంది. కానీ సాయంత్రం ఇంటికి తిరిగి రాదు. నా చిన్నారి ఎదిగి పాఠశాలకు వెళుతున్నప్పుడు ఆమెతో రోజులో 24 గంటలు ఆడుకోలేనని నా మనసుకు చెప్పడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఈ సారి (పెళ్లి చేయడాన్ని ఉద్దేశిస్తూ) ఎంత కాలం పడుతుందో చూడాలి. దాన్ని కాలమే నిర్ణయిస్తుంది. నిన్ను చాలా మిస్ అవుతున్నా నిహారిక తల్లి` అని నాగబాబు భావోద్వేగానికి లోనయ్యారు.