సోషల్ మీడియా ప్రభావం పెరిగిన దగ్గరి నుంచి ఏ మూల ఏది జరిగిన క్షణాల్లో తెలిసిపోతోంది. దీంతో సెలబ్రిటీలు ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ చిన్న తప్పు దొర్లినా వారిని సామాన్యులు సైతం సోషల్ మీడియా వేదికగా కడిగిపారేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ నెటిజన్స్కి అడ్డంగా దొరికిపోయారు. అమీర్ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం `లాల్ సింగ్ చద్దా`. హాలీవుడ్ హిట్ చిత్రం `ఫారెస్ట్ గంప్`ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు.
ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ చాలా రోజుల తరువాత టర్కీలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా అక్కడి వారు అమీర్ని చూడటానికి ఎగబడ్డారు. పోటీలుపడి మరీ అమీర్ఖాన్తో సెల్ఫీలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఇస్తాంబుల్లోని టర్కీలో ప్రస్తుతం అమీర్ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది.
ఇదిలా వుంటే టర్కీ ప్రధమ మహిళ ఎమినే ఎర్దోగన్ ని ప్రత్యేకంగా అమీర్ కలుసుకున్నారు. ఆమెతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలని ఎమినే ఎర్దోగన్ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా నెటిజన్స్తో పంచుకోవడంతో ఈ విషయం బయటపడింది. దీంతో నెటిజన్స్ అమీర్ ఖాన్ ని విమర్శించడం మొదలుపెట్టారు. ఇండియాకు బద్ద వ్యతిరేకి అయిన టర్కీకి చెందిన ప్రధమ మహిళతో అమీర్ ఖాన్ ప్రత్యేకంగా ఎందుకు సమావేశం అయ్యారని, కశ్మీర్ విషయంలో టర్కీ అధ్యక్షుడు పాక్కు మద్దతుగా నిలుస్తున్నారని, అలాంటి వారిని అమీర్ఖాన్ ప్రత్యేకంగా కలవడం ఏంటని విమర్శలు గుప్పిస్తున్నారు.