సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ పైడిపల్లితో చేయాల్సిన మూవీను పక్కనపెట్టి ఇప్పుడు పరశురామ్ తో సినిమా చేసే దిశగా అడుగులు వేస్తోన్న సంగతి తెల్సిందే. ఒకవేళ పరశురామ్ తో సినిమా ఓకే అయితే ఆ దర్శకుడు చేయాల్సిన సినిమా పక్కనపెట్టాల్సి వస్తుంది. పరశురామ్ ఇప్పటికే 14 రీల్స్ ప్రొడక్షన్ లో నాగ చైతన్య హీరోగా సినిమాను సెట్ చేసిన విషయం తెల్సిందే. ఈ దర్శకుడు చిత్రానికి నాగేశ్వర రావు అనే క్రేజీ టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించాడు. సమ్మర్ నుండి చిత్రీకరణ మొదలవుతుంది అన్న సమయంలో మహేష్ నుండి ట్విస్ట్ వచ్చింది.
మహేష్ తో సినిమా చేసే అవకాశం రావడంతో పరశురామ్ నాగ చైతన్యతో సినిమాను పక్కనపెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో చైతూ కూడా తన తర్వాతి సినిమా విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే నందిని రెడ్డితో సినిమా చేసే అవకాశాన్ని చైతూ పరిశీలిస్తున్నాడు. ఇటీవలే సమంతతో ఓ బేబీ సినిమాను తెరకెక్కించి ఫామ్ లోకి వచ్చింది నందిని రెడ్డి. ఇప్పుడు చైతూతో సినిమా చేసే అవకాశాన్ని అందుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే నాగ చైతన్యకు లైన్ వినిపించడం, హీరో ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పడం జరిగిపోయాయని సమాచారం. త్వరలోనే ఈ కాంబినేషన్ కు సంబంధించి అధికారిక ప్రకటన వస్తుంది.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ చేస్తున్నాడు నాగ చైతన్య. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ గ్లిమ్ప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను మే నెలలో విడుదల చేయాలని భావిస్తున్నారు. నాగ చైతన్య రీసెంట్ గా విక్రమ్ కె కుమార్ చెప్పిన లైన్ ను కూడా ఓకే చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. టాలెంటెడ్ దర్శకుడైనా విక్రమ్ కుమార్ కు ఇటీవలే హిట్ లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న గ్యాంగ్ లీడర్ ఫెయిలైంది. దీంతో నాగ చైతన్యతో సినిమా చేసి ఫామ్ అందుకోవాలని భావిస్తున్నాడు.
మరి నాగ చైతన్య విక్రమ్ కుమార్, నందిని రెడ్డిలతో ఎవరితో ముందుకు వేళ్తాడో అన్నది ఆసక్తికరంగా మారింది.