నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం `లవ్స్టోరీ`. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్. నారాయణ్ దాస్ నారంగ్, పి. రామ్మోహన్రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `ఫిదా` చిత్రాన్ని పక్కా తెలంగాణ యువతి కథగా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకున్న శేఖర్ కమ్ముల `లవ్స్టోరీ` చిత్రానికి కూడా ఇదే ఫార్ములాని నమ్ముకున్నారు.
తెలంగాణలోని మూరుమూల గ్రామాల నుంచి హైదరాబాద్ సిటీకి వచ్చిన ఓ జంట కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫీల్గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. గత ఏడు నెలలుగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ 7న తిరిగి ప్రారంభమైంది. కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ ఈ మూవీ షూటింగ్ని చిత్ర బృందం విజయవంతంగా పూర్తి చేసింది.
కొన్ని సన్నివేశాలు, ఓ పాటతో షూటింగ్ ముగిసింది. శేఖర్ మాస్టర్ నేతృత్వంలో సాయి పల్లవిపై చిత్రీకరించిన పాటతో షూటింగ్ పూర్తయింది. ఇదే విషయాన్ని టీమ్ వెల్లడించింది. ఈ సందర్భంగా సెట్లో వున్న ఓ ఫొటోని షేర్ చేసింది. త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నామని, దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలో వెల్లడిస్తామని ప్రకటించింది.